న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: దేశంలో గత ఏడాది నిర్లక్ష్యం కారణంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో 1.20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా లాక్డౌన్లతో రాకపోకలు తగ్గినప్పటికీ సగటున రోజుకి 328 మంది రోడ్డు ప్రమాదాల్లో విగతజీవులయ్యారు. దేశవ్యాప్తంగా గుర్తుతెలియని వాహనాలు ఢీకొని (హిట్ అండ్ రన్) 41,196 మంది మరణించారు. ఈ తరహా ఘటనల్లో సగటున రోజుకి 112 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మితిమీరిన వేగం, ప్రాణాలంటే లెక్కలేని నిర్లక్ష్యంతో నెత్తురోడుతున్న రహదారుల బీభత్స దృశ్యాన్ని జాతీయ నేర రికార్డుల సంస్థ (ఎన్సీఆర్బీ) వార్షిక నివేదిక కళ్ల ముందుంచింది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు గత ఏడాది మార్చి 25 నుంచి మే 31 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. ఆ సమయంలో రవాణా నిలిచిపోయింది. ప్రజల రాకపోకలు స్తంభించాయి. తర్వాత కూడా పలు దఫాలుగా వివిధ రాష్ర్టాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ రోడ్డు ప్రమాదాల్లో ఆశించినస్థాయిలో తగ్గుదల లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నదని నిపుణులు అంటున్నారు. రోడ్డు ప్రమాదాల్లో 2019లో 1.36 లక్షల మంది మరణిస్తే 2020లో 1.20 లక్షల మంది చనిపోయారని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. గత మూడేండ్లలో 3.29 లక్షల మంది చనిపోయారని తెలిపింది. హిట్ అండ్ రన్ కేసులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనల్లో దేశవ్యాప్తంగా 2018 నుంచి 1.35 లక్షల మంది మృతిచెందారు. వాహనాలను వేగంగా నిర్లక్ష్యంగా నడుపడంతో జరిగిన ప్రమాదాల్లో గతేడాది 1.30 లక్షల మంది గాయపడ్డారు.
స్థానిక సంస్థల నిర్లక్ష్యం వల్ల మరణాలు
2020-51
2019-147
2018-40
రైల్వే నిర్లక్ష్యం వల్ల మరణాలు
2020- 52
2019-55
2018-35
వైద్యం చేయడంలో నిర్లక్ష్యం వల్ల మరణాలు
2020-133
2019-201
2018-218