న్యూఢిల్లీ : గత కొద్దినెలలుగా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు (Cyber Fraud) గణనీయంగా పెరుగుతున్నాయి. ఆన్లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకుల నుంచి అందిన కాడికి దోచేస్తున్నారు. ఫేక్ జాబ్ ఆఫర్లు, యూట్యూబ్ వీడియో రేటింగ్స్ వంటి మాయాజాలంతో బాధితులను నిండా ముంచుతున్న స్కామర్లు రోజుకో తరహా స్కామ్తో లూటీ చేస్తున్నారు.
తాజాగా ఆన్లైన్ స్కామర్లు ముంబైకి చెందిన రిటైర్డ్ నేవీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఆశిష్ చిట్నిస్ను రూ. 2.37 లక్షలకు మోసం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆశిష్కు సెప్టెంబర్ 8న గుర్తుతెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. తన పేరు జ్యోతి అని పరిచయం చేసుకున్న కాలర్ తాను ఆశిష్కు ఖాతా ఉన్న ఓ జాతీయ బ్యాంకులో పనిచేస్తున్నట్టు నమ్మబలికింది.
లాకర్ ఫీజు బకాయి ఉందని, రూ. 6600 బ్యాంకుకు చెల్లించాలని బాధితుడికి తెలిపింది. ఆమె కాల్ చేసిన కొద్ది వారాల తర్వాత ఆశిష్ తన బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసుకోగా సెప్టెంబర్ 8, సెప్టెంబర్ 15న జరిగిన లావాదేవీల్లో రూ. 2.37 లక్షలు దారిమళ్లినట్టు గుర్తించి కంగుతిన్నాడు. మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రిటైర్డ్ నేవీ అధికారి బ్యాంక్ ఖాతాల నుంచి అక్రమంగా జరిగిన నిధుల బదలాయింపునకు సంబంధించి వివరాలను బ్యాంక్ నుంచి రాబడుతున్నామని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :