కరోనా ఫస్ట్ వేవ్తో దేశంలో లాక్డౌన్ నడుస్తున్నది. 2020 మార్చి 25న అమ్మమ్మ సచ్చిపోయింది. ఆగమ్మ సచ్చిపోయింది కరోనాతో కాదు, గుండెపోటుతో. అదీ తన సొంతూరు లక్ష్మీపూర్లో కాదు. తన రెండో బిడ్డ చింతకింది రాధవ్వ ఇంటికాడ (జగిత్యాల జిల్లా రాములపల్లె). అమ్మమ్మ బల్గం పెద్దది, ఆమెకు ఇద్దరు కొడుకులు, నలుగురు బిడ్డలు. దగ్గర దగ్గర అరువై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమె శవాన్ని లక్ష్మీపూర్ తీసుకరావడానికి ఎన్ని తిప్పలవడ్డమో, సొంతూళ్లె ఆమెను దహనం చేయడానికి అంతకన్నా ఎక్కువనే తిప్పలవడ్డం.
కరోనాతోనే కాలం జేసిందని పుకార్లు లేసినయి. పట్టుమని పది మంది కూడా రాలె. ఇగ మందే లేరంటే డప్పెక్కడిది, కుండెక్కడిది? పాడెను మోసేటందుకు నలుగురు మనుషులెక్కడిది? కనీసం బొంద తవ్వేటందుకు ఇద్దరు మనుషులూ లేకుంటే పొక్లయినర్ సాయంతో బొంద తోడిపిచ్చినం. ఆటోలో తీసుకొచ్చిన అమ్మమ్మ శవాన్ని డైరెక్టు బొంద కాడికే తీస్కపోయినం. అమ్మమ్మ బల్గం పెద్దది కాబట్టి సరిపోయింది. ఏడెనిమిది మంది మనమళ్లం పాడె కట్టి ఓ ఆరడుగులు మోసి గౌరవంగా బొందలకు దించినం. లేకుంటే అదే పొక్లయినర్తోనే అమ్మమ్మను బొందలేసేటోళ్లేమో. ఎంతోమందిని పెంచి పెద్దచేసిన అమ్మమ్మను అంతమందిమి ఉండి కూడా కనీసం గౌరవంగా సాగనంపకపోతిమి, బుద్ధి దీరా అమ్మమ్మను కడసూపు చూసుకోపోతిమి అన్న బాధ నన్ను ఇప్పటికీ వేధిస్తూనే ఉంటది.
పోయినేడాది పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఓ కరోనా రోగి సచ్చిపోతే ఆ శవాన్ని దహనం చేసేందుకు ఎవ్వరూ ముందుకురాలె. ఆఖరికి మున్సిపల్ ట్రాక్టర్లో ఆ శవాన్ని తీస్కపోదామని ఆలోచన చేస్తే డ్రైవర్ భయపడి ఎన్కకువోయిండు. విధిలేని పరిస్థితుల్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన పెండ్యాల శ్రీనివాస్ శ్రీరామ్ అనే పెద్ద డాక్టరే ధైర్యంగా ముందటవడి, పీపీఈ కిట్ వేసుకొని మరీ ట్రాక్టర్కు డ్రైవర్గా మారిండు. ఆ శవానికి దహన సంస్కారాలు నిర్వహించిండు. ఆ డాక్టర్ ధైర్యాన్ని మెచ్చుకొని ఉప రాష్ట్రపతి కూడా తారీఫ్ చేసిండు.
అసలు కరోనాతోని సచ్చిపోయిన శవం మీద వైరస్ ఎంతసేపు ఉంటదని డాక్టర్లను అడిగితే.. వాళ్లు చెప్పేదేమంటే 3 గంటలు కూడా వైరస్ బాడీలో ఉండదంటున్నారు. ఇది శాస్త్రీయంగా రుజువు కాకపోయినా కరోనా శవంతోని ఇంకో మనిషికి కరోనా సోకినట్లు కూడా ఎక్కడా రుజువు కాలేదు. కాకపోతే కరోనా కారణంగా సచ్చిపోయిన మనిషి దహనమో, లేక ఖననమో చేసేటప్పుడు జాగ్రత్తలు మాత్రం పాటించాలి. కరోనా శవాన్ని ప్రత్యేకంగా ప్యాక్ చేయించి, ఆ ప్యాకింగ్పై ఉన్న వైరస్ అంతమయ్యేందుకు కరోనా నివారణ రసాయనాలు చల్లాలి. ఆ శవానికి దగ్గర ఉండేవాళ్లెవ్వరో అందరూ పీపీఈ కిట్లు తప్పకుండా వేసుకోవాలి. ఒకరికొకరు మీద పడి ఏడ్వడం, అందరొక్కదగ్గర గుమిగూడటం లాంటివి చేయొద్దు, అట్లా చేస్తే పక్కాగా వైరస్ విజృంభించే అవకాశం ఉంటుంది, అదీ వాళ్ల మజ్జన ఎవరైనా కరోనా రోగి ఉంటేనే.
అప్పటిదాకా మన మధ్యలో ఉన్న ఒక మనిషి సచ్చిపోయిండని తెలిస్తేనే గుండె చెరువవుతుంది. అలాంటిది ఇప్పుడు మనుషులు సచ్చిపోతుంటే కుక్కలను కదా ఈడ్చిపారేసినట్టు పారేస్తుండటం చూస్తుంటే కడుపు తరుక్కుపోతున్నది. కొందరైతే కరోనాతోని సచ్చిపోయిండని తెలిస్తే చాలు, కనీసం ఆ శవాన్ని కూడా తీసుకపోవడం లేదంటే వారికి ఉన్న అవగాహన ఎంతటిదో ఊహించుకోవచ్చు. సో.. నేను చెప్పేదొక్కటే, మనం డాక్టర్ శ్రీరామ్ సార్ను ఆదర్శంగా తీసుకొని జాగ్రత్తలు పాటించి ఆఖరి ప్రయాణంలో అండగా ఉందాం. పీపీఈ కిట్లు వేసుకొని దూరం దూరంగా ఉంటూ కరోనాతోటి సచ్చిపోయిన మనిషిని గౌరవంగా సాగనంపుదాం. పోయిన మనిషి ఎట్లాగూ మళ్లా రాడు, కనీసం ఆయన్ను గౌరవంగా పంపించామన్న తృప్తి అయినా మనకు మిగులుతుంది.
గడ్డం సతీష్