హయత్నగర్ రూరల్ : తోటి స్నేహితులతో కలిసి జలపాతంలో స్నానం చేసేందుకు వెళ్లిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్కు అనుకుని ఉన్న ఓ జలపాతంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. నగరంలోని ఎర్రగడ్డకు చెందిన మహ్మద్ ఇఫ్తాక్ అహ్మద్(21) అబిడ్స్లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. శనివారం తోటి స్నేహితులతో కలిసి చెక్డ్యాం పై నుంచి జలపాతంలా పడుతున్న నీటి వద్దకు వెళ్లాడు.
కాసేపు అంతా సరదాగా ఆడుకున్నారు. ప్రమాదవశాత్తు అహ్మద్ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. తోటి స్నేహితులు గాలిస్తూనే.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. గాలించగా అహ్మద్ అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు.