జైపూర్ : తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో టీనేజర్ (18) బాలిక(17)పై దాడిచేసిన ఘటన రాజస్ధాన్లో మంగళవారం వెలుగుచూసింది. బాలిక కోసం వేచిచూసిన నిందితుడు స్కూల్ ప్రాంగణంలోనే బ్లేడుతో ఆమెపై దాడికి తెగబడ్డాడు. స్కూల్ విశ్రాంతి సమయంలో తరగతి గదిలో బాలిక ఒంటరిగా ఉండటం గమనించిన నిందితుడు ఈ దారుణానికి పాల్పడి పరారయ్యాడు.
రక్తపు మడుగులో ఉన్న బాలికను టీచర్లు, స్కూల్ సిబ్బంది కాపాడారు. 12వ తరగతి చదివే నిందితుడు గత కొద్దిరోజులుగా బాలిక వెంటపడుతున్నట్టు తెలిసింది. బాలిక ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతోందని, ఆమె ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని మార్వాడ్ జంక్షన్ ఎస్హెచ్ఓ మోహన్ సింగ్ తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.