జైపూర్ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన అల్వార్ లైంగిక దాడి కేసును రాజస్థాన్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. మానసిక వికలాంగురాలైన 15 ఏండ్ల బాలికపై అల్వార్ జిల్లాలో లైంగిక దాడి జరిపిన దుండగుడు బాధితురాలిని ఫ్లైఓవర్పై పడవేసి వెళ్లిన ఘటన ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన రాజస్ధాన్ పోలీసులు బాలికపై లైంగిక దాడి జరగలేదని చెబుతున్నారు.
జనవరి 11న అల్వార్ ఫ్లైఓవర్ వద్ద రక్తపు మడుగులో బాలిక కనిపించింది. సాంకేతిక ఆధారాలు, వైద్య నివేదికల ప్రకారం బాలికపై లైంగిక వేధింపులు జరగలేదని వెల్లడించాయని రాజస్ధాన్ పోలీసులు చెప్పుకొచ్చారు. బాలిక ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం కావడంతో ఆమెపై లైంగిక దాడి జరిగి ఉంటుందని అనుమానించారు.
బాధితురాలి ఇంటి నుంచి ఫ్లైఓవర్ ప్రారంభమయ్యే వరకూ పలు సీసీటీవీల ఫుటేజ్ను పరిశీలించామని పోలీసులు పేర్కొన్నారు. బాలిక తన గ్రామం నుంచి సిటీకి వచ్చిన ఆటో డ్రైవర్నూ పోలీసులు ప్రశ్నించారు. మరోవైపు ఆటోలో బాలికపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. ఇక బాలిక ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.