Rajasthan : రాజస్థాన్లో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక అనుమానాస్పదంగా మరణించింది. దీంతో బాలికపై హత్యాచారం జరిగిందంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. పోలీసులు, బాధిత బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్, బికనీర్ పరిధి, రంజీత్పూర్కు చెందిన పదమూడేళ్ల బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. స్కూల్లో పరీక్షకు వెళ్తున్నానని చెప్పి శనివారం ఉదయం 11.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన బాలిక తిరిగి రాలేదు.
బాలిక స్కూల్కు రాకపోవడంతో ఉపాధ్యాయులు ఆమె కుటుంబానికి మధ్యాహ్నం సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు బాలిక కోసం గాలించగా.. స్కూల్కు అర కిలోమీటర్ దూరంలో, అడవిలో బాలిక మృతదేహం కనిపించింది. అది కూడా అర్ధనగ్నంగా. ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయి. దీంతో బాలికపై అత్యాచారం చేసి చంపేశారని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. స్థానిక హైవేను దిగ్బంధించారు. బాలికపై హత్యాచారం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలిక కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై పోలీసులు, అధికారులు స్పందించారు. బాలిక బంధువులతో చర్చలు జరుపుతున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఆమెపై అత్యాచారం జరిగిందా లేదా అనేది పోస్టుమార్టం నివేదికలో తేలనుంది. ఈ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. పరిహారం, ఆందోళన విరమించచే విషయంలో చర్చలు జరుగుతున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాల్ని మోహరించారు. మరోవైపు స్థానిక ఎంపీ అర్జున్ రామ్ మేఘవాలే స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా చూస్తానని తెలిపారు.