చండీగఢ్: తుపాకీ బుల్లెట్ గాయాలతో ఒక వ్యక్తి కారులో మరణించి ఉండటం కలకలం రేపింది. పంజాబ్లోని మొహాలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మొహాలిలోని జల్ వాయు విహార్లో నివాసం ఉంటున్న కరణపాల్ శర్మ, బుధవారం ఉదయం ఆరు గంటలకు తన ఇంటి సమీపంలో హ్యుందాయ్ క్రెటా కారులో చనిపోయి ఉన్నాడు. అతడి తల, నోటి నుంచి రక్తం కారడాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతుడి తలకు తుపాకీ బుల్లెట్ గాయం ఉండటాన్ని పోలీసులు గమనించారు. అతడి కుడి చేతిలో ఉన్న పిస్టల్, జేబులో ఉన్న తొమ్మిది బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందం కూడా అక్కడకు చేరుకుంది. మృతుడి చేతి నుంచి తుపాకీ కాల్పుల నమూనాలను సేకరించారు. వీటి ఆధారంగా కరణపాల్ శర్మ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి తండ్రి సురిందర్ కుమార్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పంజాబ్లో ఇటీవల తుపాకీ కాల్పుల సంఘటనలు ఆందోళన కలిగిస్తుండటంతో ఈ ఘటన పోలీసులను ఉరుకులుపెట్టించింది. అలాగే దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.