ముంబై: ఒక పోలీస్ హత్య కోసం మరో పోలీస్ సుపారీ ఇచ్చాడు. మహారాష్ట్రలోని పూణేలో ఈ ఘటన జరిగింది. ఫరస్ఖానా పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఒక కానిస్టేబుల్, దత్తవాడి పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న మరో కానిస్టేబుల్ మధ్య పాత కక్షలున్నాయి. ఈ నేపథ్యంలో దత్తవాడి పీఎస్ కానిస్టేబుల్ను హత్య చేసేందుకు ఫరస్ఖానా పీఎస్ కానిస్టేబుల్ కుట్ర పన్నాడు. నేరస్తుడు యోగేశ్ ప్రహ్లాద్ అడ్సుల్కు పది వేలు సుపారీగా ఇచ్చాడు. అయితే శనివారం ఆ నేరస్తుడ్ని దత్తవాడి పోలీసులు అరెస్ట్ చేశారు. యోగేశ్ను ప్రశ్నించగా ఈ విషయం బయటపడింది. దీంతో ఫరస్ఖానా పీఎస్ కానిస్టేబుల్పై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన ఆ కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడు.