మియాపూర్ : డ్యూటీకని ఇంట్లో చెప్పి వెళ్లిన ఓ ప్రయివేటు ఉద్యోగి అదృశ్యం అయిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. మియాపూర్ ఎస్ఐ రవికిరణ్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం… తుక్కాని నర్సింహారెడ్డి (46) స్పార్కో కంపెనీలో ఇంజినీర్గా పనిచేస్తూ మియాపూర్ జనప్రియ అపార్టుమెంట్లో కుటుంబంతో నివాసముంటున్నాడు.
ఈనెల 9 న డ్యూటీకి వెళుతున్నట్లు నర్సింహారెడ్డి ఇంట్లో చెప్పి వెళ్లాడు.ఆయన భార్య సుజాత సాయంత్రం 4 గంటలకు భర్తకు ఫోన్ చేయగా..స్విఛాఫ్గా వచ్చింది. వెంటనే సదరు కంపెనీకి వెళ్లి విచారించగా…వారం రోజుల క్రితమే డ్యూటీ మానేసి వెళ్లిపోయినట్లు సమాధానమిచ్చారు.
దీంతో పరిసర ప్రాంతాలు, స్నేహితులు, బంధువులను విచారించినప్పటికీ నర్సింహారెడ్డి ఆచూకి లభించలేదు. ఈ మేరకు మియాపూర్ పోలీస్ స్టేషన్లో సుజాత ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.