చెన్నై : ఐఐటీ మద్రాస్ లైంగిక వేధింపుల కేసులో చెన్నై పోలీసులు సోమవారం ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్లో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయగా ప్రస్తుతం అతడు డైమండ్ హార్బర్ పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉన్నాడు. నిందితుడు కింగ్షక్ దేవ్శర్మను పట్టుకునేందుకు చెన్నై పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఐఐటీ మద్రాస్లో 2016 నుంచి 2020 మధ్య నిందితుడితో పాటు మరో ఏడుగురు అతడి అనుచరులు తనను లైంగిక వేధింపులుక గురిచేశారని పీహెచ్డీ పరిశోధకురాలు, దళిత మహిళ (30) ఏడాది కిందట ఫిర్యాదు చేసిన అనంతరం తాజాగా ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. స్ధానిక కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ పొందిన అనంతరం కింగ్షుక్ను చెన్నైకి తీసుకువస్తారు.
ఇనిస్టిట్యూట్ లోపల నిందితులు తనను శారీరకంగా, మానసికంగా వేధించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. లేబరేటరీ పరికరాలతో పనిచేసేందుకు వారు తనను అనుమతించలేదని ఆమె ఆరోపించారు. మార్చి 2020లో బాధితురాలు మైలాపూర్ మహిళా పోలీస్ స్టేషన్లో నిందితులపై ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన మూడు నెలల తర్వాత జూన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.