చెన్నై : మంచి మాటలు చెప్పి అందరినీ సన్మార్గంలో నడిపించాల్సిన ప్రబోధకుడు 17 ఏండ్ల బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలోని పేరూర్ ప్రాంతంలో వెలుగుచూసింది. బాలిక నివసిస్తున్న ప్రాంతంలో స్టీఫెన్ రాజ్ అనే నిందితుడు ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడ ప్రతి శుక్రవారం ప్రార్ధనలు నిర్వహిస్తున్నాడు.
తమిళనాడు, కర్నాటకలోని పలు ప్రాంతాలకూ నిందితుడు ప్రసంగీకుడిగా వెళుతుంటాడు. ఈ క్రమంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లోపలికి వచ్చిన స్టీఫెన్ రాజ్ ఆమె చెల్లెలిని వేరే గదిలో బంధించి బాధితురాలిని లైంగిక వేధింపులకు గురిచేశాడు. బాలిక సాయం కోసం అరవగా నిందితుడు పరారయ్యాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.