అహ్మదాబాద్ : గుజరాత్లో కలకలం రేపిన హత్యాచార ఘటనకు సంబంధించి లైంగిక దాడి నిందితులను వడోదర పోలీస్ డాగ్ 30 నిమిషాల్లోనే గుర్తించింది. డాగ్ స్వ్కాడ్కు చెందిన జవా అనే ఆడ కుక్క అహ్మదాబాద్-ముంబై రైల్వే ట్రాక్పై రెండు కిలోమీటర్లు గాలించిన మీదట ఓ బాటిల్, దుపట్టాను పసిగట్టి నిందితుల దిశగా పోలీసులను నడిపించింది. ఆ ప్రాంతంలోని ఓ టెంట్ వద్దకు వెళ్లి అక్కడ పెద్దగా మొరిగింది. దీంతో ఆ ప్రాంతంలో దాగిఉన్న లైంగిక దాడి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసుల్లో 45 రోజుల్లో జవా పోలీసులకు నిందితులను పట్టుకోవడంలో సహకరించడం ఇది మూడవసారి కావడం గమనార్హం.
తాజా ఘటనలో ఆగస్ట్ 16న నిందితులు కర్జాన్ తాలూకాలోని దెహ్తన్ గ్రామం సమీపంలో పొలంలో గడ్డి కోస్తున్న 30 ఏండ్ల మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి ఆపై దారుణంగా హత్య చేశారు. రాత్రి పొద్దుపోయాక కూడా ఇంటికి రాకపోవడంతో మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాగ్ స్వ్కాడ్తో ఘటనా ప్రాంతానికి పోలీసులు చేరుకున్న క్రమంలో జవా సాయంతో రైల్వే ట్రాక్ వద్ద గుడారాల్లో దాగి ఉన్న నిందితుడు లాల్ బహదూర్ గిరిజారామ్ (22) అనే యూపీ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన ఐదుగురు నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.