అహ్మదాబాద్ : లౌడ్స్పీకర్ల వివాదం కొనసాగుతున్న నేపధ్యంలో గుజరాత్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మెహసన జిల్లా ముదర్ధ గ్రామంలోని ఆలయంలో లౌడ్స్పీకర్తో అసౌకర్యం కలిగిస్తున్నాడనే ఆగ్రహంతో 40 ఏండ్ల వ్యక్తిని కొందరు చావబాదారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై హత్య, దాడి కేసులు నమోదు చేశారు.
మృతుడిని దినసరి కూలీగా పనిచేసే జశ్వంత్జీ ఠాకూర్గా గుర్తించారు. మే 4న రాత్రి ఏడు గంటల సమయంలో తమ ఇంటి సమీపంలోని మెల్దీ మాత ఆలయంలో తనతో పాటు తన సోదరుడు జస్వంత్ ఆరతి ఇస్తుండగా సదాజీ ఠాకూర్ అనే వ్యక్తి వచ్చి లౌడ్స్పీకర్ను నిలిపివేయాలని కోరాడని మృతుడి సోదరుడు అజిత్ తెలిపారు.
లౌడ్స్పీకర్ ఆపేసేందుకు తాము నిరాకరించడంతో సదాజీతో పాటు మరికొందరు కర్రలతో తమపై దాడి చేశారని చెప్పారు. సోదరులు ఇద్దరినీ ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ జశ్వంత్ మరణించాడు. కాగా ఇటీవల అహ్మదాబాద్ జిల్లాలోని ఓ ఆలయంలో లౌడ్స్పీకర్ ఆన్ చేశాడని 30 ఏండ్ల వ్యక్తిపై కొందరు దాడి చేశారు. మహారాష్ట్రలో మే 3 నాటికి మసీదుల్లో లౌడ్స్పీకర్లు తొలగించాలని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే అల్టిమేటం జారీ చేసిన క్రమంలో లౌడ్స్పీకర్ల వివాదం తారాస్ధాయికి చేరింది.