లక్నో : లేటు వయసులో ఒకరికొకరు ఆసరాగా ఉండాల్సిన సమయంలో అనుమాన బీజం తొలిచింది. 66 ఏండ్ల భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వృద్ధుడు (77) గాఢనిద్రలో ఉండగా ఆమెను దారుణంగా హత్య చేశాడు. యూపీలోని ఫతేపూర్ జిల్లాలో ఈ ఉదంతం బయటపడింది. భార్య ప్రవర్తనపై అనుమానంతో తరచూ ఆమెతో భర్త గొడవ పడుతుండే వాడు.
ఆమె ఎక్కడికి వెళ్లినా వెంట వెళుతుండటంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతుండేది. బాధితురాలు లలితా దేవి ఇంటి వరండాలో రక్తపు మడుగులో విగతజీవిగా పడిఉండటం గ్రామస్తులు గుర్తించడంతో ఈ దారుణం వెలుగుచూసింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు శివ్ బరన్ను అరెస్ట్ చేశారు.
భార్య దేవి ప్రవర్తనపై అనుమానంతో తాను ఆమెను హత్య చేశానని విచారణలో నిందితుడు అంగీకరించాడు. భార్యపై అనుమానంతో మధనపడిన తాను బుధవారం రాత్రి ఆమె నిద్రిస్తుండగా పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశానని తెలిపాడు. నిందితుడిని అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశామని ఎస్పీ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు.