న్యూ ఢిల్లీ: రెక్కాడితేకానీ డొక్కాడని దుస్థితి ఆ దంపతులది. భవన నిర్మాణ పనులు చేసుకుంటూ బతుకును లాక్కొస్తున్నారు. రెక్కలకష్టంతో నెట్టుకొస్తున్న ఈ దంపతుల జీవితాల్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. కుక్కల దాడిలో తమ నెలల పసికందును పోగొట్టుకున్నారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో చోటు చేసుకుంది.
నోయిడా సెక్టార్ 100లో గల లోటస్ బౌలెవార్డ్ హౌసింగ్ సొసైటీలో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు ఆ దంపతులు కూడా వెళ్తున్నారు. తమ ఏడు నెలల చిన్నారితో అక్కడే ఉంటూ.. పనులు చేసుకుంటూ పొట్ట నింపుకుంటున్నారు. అయితే చిన్నారిని చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో పని ప్రదేశానికి తీసుకెళ్తుంటారు. రోజూలాగే, సోమవారం కూడా వారు పసికందును తీసుకుని నిర్మాణ పనులకు వెళ్లారు. చిన్నారిని ఒక చోట ఉంచిన దంపతులు సమీపంలో పనుల్లో నిమగ్నమయ్యారు.
ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ వీధి కుక్క చిన్నారిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. గమనించిన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పసికందుకి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. అయినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆ పసికందు మృతి చెందింది.
ఘటనపై స్థానికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కలు దాడి చేయడం ఇది మొదటిసారి కాదని ప్రతి మూడు నెలలకోసారి దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నోయిడా అథారిటీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు.