రాయ్పూర్: కొత్తగా పెళ్లైన జంట, రిసెప్షన్కు ముందు తమ గదిలో మరణించారు. గది లోపల రక్తం మడుగుల్లో పడి ఉన్నారు. దీనిని చూసిన బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఈ సంఘటన జరిగింది. 24 ఏళ్ల అస్లామ్, 22 ఏళ్ల ఖకాషా బానోకు ఆదివారం వివాహం జరిగింది. తిక్రపారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రిజ్నగర్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. కొత్త దంపతులు దీని కోసం తమ గదిలో రెడీ అవుతున్నారు. ఇంతలో ఆ గది నుంచి అరుపులు, కేకలు వినిపించాయి. వధువు తల్లి వాటిని విన్నది. బంధువులు కూడా పరుగున అక్కడకు వచ్చారు. గది తలుపులు మూసి ఉండటంతో కిటికీ నుంచి లోపలకు చూశారు. కొత్త జంట రక్తం మడుగుల్లో పడి ఉండటం చూసి వారంతా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు మూసి ఉన్న గది తలుపులు బద్ధలుకొట్టారు. లోనికి వెళ్లి చూడగా కొత్త దంపతులు కత్తి గాయాలతో మరణించినట్లు గ్రహించారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పడి ఉన్న కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు రిసెప్షన్ ఫంక్షన్ కోసం రెడీ అవుతున్న కొత్త జంట మధ్య గొడవ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన వరుడు కత్తితో వధువును హత్య చేసి ఆపై తాను పొడుచుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. కొత్త దంపతుల మరణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.