Tamil Nadu | అప్పుడే పుట్టిన పసికందు.. ప్రభుత్వ పాఠశాల టాయిలెట్లో శవమై కనిపించింది. టాయిలెట్లో లభ్యమైన శిశువు మృతదేహాన్ని చూసి శానిటరీ వర్కర్ తీవ్ర భయాందోళనకు గురైంది. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్కు సమాచారం అందించింది. ఈ ఘటన తమిళనాడులోని ట్రిచ్చిలో బుధవారం వెలుగు చూసింది.
ట్రిచ్చిలోని కట్టూరు ఏరియాలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. అయితే బుధవారం ఉదయం పాఠశాల ఆవరణలోని టాయిలెట్ను శుభ్రం చేసేందుకు ఓ పారిశుద్ధ్య కార్మికురాలు వెళ్లింది. టాయిలెట్లో చనిపోయిన పసికందును చూసి ఆందోళనకు గురైంది. క్షణాల్లోనే స్కూల్ ప్రిన్సిపల్కు కార్మికురాలు సమాచారం అందించింది. టాయిలెట్ వద్దకు చేరుకున్న ప్రిన్సిపల్ పసికందును చూసి షాక్కు గురైంది. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు ప్రిన్సిపల్.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మగ బిడ్డను ఎవరో టాయిలెట్లో పడేసి వెళ్లిపోయారని పోలీసులు పేర్కొన్నారు. పుట్టిన కొద్ది గంటల్లోనే శిశువు చనిపోయి ఉంటాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శిశువు తల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.