భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో దారుణం జరిగింది. మహారాష్ట్రలోని నగ్పూర్కు చెందిన మహిళను 16 నెలల పాటు నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడి బలవంతంగా బిడ్డను కనేలా ఒత్తిడి చేసిన వ్యక్తి ఉదంతం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి కధ్ బరోడా గ్రామానికి చెందిన నిందితుడు, గ్రామ మాజీ ఉప సర్పంచ్ రాజ్పాల్ సింగ్ (38)ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని నగ్పూర్కు చెందిన మహిళ దెవాస్ గేట్ బస్టాండ్ వద్ద కనిపించడంతో ఈ దారుణం బయటకువచ్చింది.అపస్మారక స్ధితిలో ఉన్న ఆమెను నిందితుడు నవంబర్ 6న బస్టాండ్ వద్ద విడిచివెళ్లాడు.
స్ప్రహలోకి వచ్చిన అనంతరం బాధితురాలు నిందితుడి నిర్వాకాన్ని పోలీసులకు తెలిపింది. మహారాష్ట్ర మహిళను నిందితుడు మధ్యవర్తుల సాయంతో 16 నెలల కిందట కొనుగోలు చేసి ఉజ్జయినికి తీసుకువచ్చాడు. భార్య చంద్రకాంత (26) సాయంతో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. సింగ్ దంపతులకు కలిగిన ఇద్దరు పిల్లలు మరణించడంతో బాధితురాలితో బలవంతంగా బిడ్డను కనేలా ఒత్తిడి చేశారు. అక్టోబర్ 25న బాధితురాలు శిశువకు జన్మనివ్వడంతో నవంబర్ 6న ఆమెను నిందితుడు సింగ్ బస్టాండ్ వద్ద వదిలివెళ్లాడు. మహిళ ఫిర్యాదుతో నిందితుడు సింగ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి భార్య సహా మరో ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు.