ఉస్మానియా యూనివర్సిటీ : పాతకక్షలతో గురువారం జరిగిన హత్య కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోడ్రైవర్గా పనిచేసే రాజేశ్ అలియాస్ రాజు హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహించిన మృతుడి బంధువులు అనుమానితులైన రమేశ్, వెంకటేశ్ ఇళ్లపై దాడి చేసి నిప్పుపెట్టారు.
అప్పటికే ఆయా ఇంట్లో వారు ఇళ్లకు తాళాలేసి వెళ్లిపోవడంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం తప్పింది. ఇంట్లో ఉన్న పలు వస్తువులు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పివేశారు. అప్పటికే ఇంట్లో ఉన్న సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.