దోమలగూడ : గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైన సంఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కవాడిగూడ కల్పనా ధీయేటర్ ఎదురుగా ఉన్న ఫుట్పాత్ పై శుక్రవారం, ఓ గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితితో ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిని పరిశీలించగా, అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గొంతులో సీసాతో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించి, క్లూస్ టీం సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మృతుడి మృతదేహం పైన అదే విధంగా పక్కనే ఉన్న బీరు సీసాల మీద ఉన్న వేలిముద్రలను సేకరించారు.
అయితే మృతుడి గురించి స్థానికంగా పోలీసులు విచారించగా, గత కొన్నేండ్లుగా ఫుట్పాత్ పై ఉంటు జీవనం సాగిస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే మృతుడికి ఆగమయ్య అనే వ్యక్తికి గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు ఆగమయ్య అనే వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం సాయంత్రం నిందితుడిగా అనుమానిస్తున్న ఆగమయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.