ముంబై: పరీక్షా ఫలితాల విడుదల కోసం ఒక యూనివర్సిటీని బాంబులతో పేల్చివేస్తామని బెదిరించారు. మహారాష్ట్రలోని ముంబై యూనివర్సిటీకి ఈ మేరకు బెదిరింపు ఈ మెయిల్స్ అందాయి. బీఏ, బీకామ్, బీఎస్సీ పరీక్షల తుది ఫలితాలను విడుదల చేయకపోతే వర్సిటీ బిల్డింగ్ను బాంబులతో పేల్చివేస్తామని అందులో హెచ్చరించినట్లు ముంబై యూనివర్సిటీ పరీక్షల, మూల్యాంకన డైరెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారులు దీనిపై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని చెప్పారు. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు బెదిరింపు ఈ మెయిల్స్ పంపిన ఐపీ అడ్రస్ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఆలస్యమైంది.