తన కూతురు కనబడడం లేదంటూ ఒక తల్లి పోలీసులను ఫిర్యాదు చేసింది. 5 రోజుల తరువాత ఒక పాప మృతదేహం ఇసుకలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ పాప హత్య కేసుని దర్యాప్తు చేసిన పోలీసులకు కొన్నిచీకటి నిజాలు తెలిశాయి.
పంజాబ్లోని తరన్తారన్ నగరానికి చెందిన సందీప్ కౌర్ అనే మహిళ నవంబర్ 30న తన 6 ఏళ్ల పాప కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 5న ఒక పాప శవం ఇసుకలో దొరికినట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు పాప హత్య కేసు విచారణ మొదలు పెట్టారు.
పాప తల్లి సందీప్ కౌర్ తన భర్తతో విడిపోయి ఒంటరిగా ఉండేది. ఆమెకు లవ్జీత్ సింగ్ అనే యువకుడితో సంబంధాలున్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో లవ్జీత్ సింగ్ని విచారణకు పిలిచి అతని ఫోన్ కాల్ వివరాలను పోలీసులు పరిశీలించారు. పాప హత్య జరిగిన ప్రాంతంలో అదే సమయానికి లవ్జీత్ అక్కడే ఉన్నట్లు పోలీసులు అతడి ఫోన్ లొకేషన్ని బట్టి తెలుసుకున్నారు.
ఆ తరువాత పోలీసులు తమ పద్ధతిలో లవ్జీత్ను ప్రశ్నించగా.. అతను నేరం ఒప్పుకున్నాడు. కానీ అతనొక్కడే ఆ నేరం చేయలేదు. పోలీసుల విచారణ ప్రకారం.. భర్త నుంచి విడిపోయిన సందీప్ కౌర్ తన 6 ఏళ్ల పాపతో ఒంటరిగా నివసించేది. ఆమె తన ప్రియుడు లవ్జీత్ను రాత్రివేళ మాత్రమే ఇంటకి పిలిచేది. ఒకరోజు వారిద్దరూ గదిలో ఒంటరిగా ఉండగా.. ఆ పాప వారిని చూసింది. తను ఇక తల్లితో ఉండనని.. తండ్రి వద్దకు వెళ్లి అంతా చెబుతానని చెప్పడంతో కన్నకూతురిని చంపేయమని సందీప్ కౌర్ తన ప్రియుడికి చెప్పింది.
దీంతో లవ్జీత్ పాపను హత్య చేసి తన మిత్రుడు బల్విందర్ సింగ్ సహాయంతో పాప శవాన్ని ఇసుకలో దాచేశాడు. ఆ తరువాత సందీప్ కౌర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి తన పాప ఆచూకీ తెలియడంలేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రస్తుతం సందీప్ కౌర్, లవ్జీత్ సింగ్లను అరెస్టు చేశారు. ఇసుకలో పాప శవం దాచిన బల్విందర్ సింగ్ పరారీలో ఉన్నాడు.