గువహటి : అసోంలోని నాగావ్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. వివాహేతర సంబంధం కారణంగా బిడ్డకు జన్మనివ్వడంతో ప్రియుడితో కలిసి కన్నతల్లి చిన్నారిని చిదిమేసింది. నవజాత శిశువుచే ఉప్పు తినిపించి కడతేర్చింది. పసికందును చంపిన తర్వాత మృతదేహాన్ని ఇంటివెనుక పాతిపెట్టింది.
చిన్నారిని పాతిపెడుతుండగా స్ధానికులు కొందరు గమనించడంతో ఆమె రెడ్హ్యాండెడ్గా పట్టుబడింది. పోలీసులు, గ్రామస్తుల సమక్షంలో మహిళ తన నేరాన్ని అంగీకరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు బిడ్డల తల్లయిన మహిళ తన భర్త మామ సైఫుల్ ఇస్లాంతో గత రెండేండ్లుగా వివాహేతర సంబంధం కలిగిఉంది.
వీరిద్దరి మధ్య సంబంధం కారణంగా బుధవారం మహిళ శిశువుకు జన్మనిచ్చింది. ఈ సమయంలో ఆమె భర్త కేరళలో ఉన్నాడు. తమకు పుట్టిన బిడ్డ గురించి ఎవరికీ తెలియకుండా చిన్నారిని చంపేయాలని మహిళ ప్రియుడు సూచించాడు. దీంతో శిశువు ఉసురు తీసినట్టు మహిళ అంగీకరించిందని పోలీసులు చెప్పారు. మహిళతో పాటు ఆమె మామను పోలీసులు అరెస్ట్ చేశారు. శిశువు మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.