మొయినాబాద్ : బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ మహిళా రాత్రి సమయంలో రోడ్డు దాటుతుండగా ట్రాలీ ఆటో ఢీకొని మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై కనకమామిడి గేట్ వద్ద చోటుచేసుకుంది. ఎస్ఐ నారాయణసింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా ధారూర్కు చెందిన విజయలక్ష్మి(35), అశోక్ దంపతులు కొన్నాళ్ల క్రితం బతుదెరువు కోసం వలస వచ్చారు. మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామం సమీపంలో ఉన్న ఓ ఫామ్హౌస్లో కూలీ పని చేస్తూ అక్కడే ఉంటున్నారు. కాగా విజయలక్ష్మి సొంత ఊరికి వెళ్లి బుధవారం రాత్రి తిరిగి వస్తూ కేతిరెడ్డిపల్లి గేట్ వద్ద బస్సు దిగాల్సి ఉండగా, చీకటిగా ఉండటంతో కేతిరెడ్డిపల్లి గేట్ వద్ద దిగలేదు.
బస్సు ముందుకు వెళ్లడంతో కనకమామిడి గేట్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా ట్రాలీ ఆటో వచ్చి ఆమెను ఢీకొన్నది. దీంతో ఆమె తలకు తీవ్రగాయాలైనాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 సమాచారం అందించారు. 108లో దవాఖానకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరికీ తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపాడు.