లక్నో: ఆశారాం బాపు ఆశ్రమం లోపలున్న కారులో అదృశ్యమైన బాలిక మృతదేహం లభించింది. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 5న ఇంటి బయట ఆడుకుంటున్న 14 ఏండ్ల బాలిక అదృశ్యమైంది. దీంతో బాలిక తల్లి ముగ్గురు పొరుగువారిపై అనుమానం వ్యక్తం చేసి కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా, శుక్రవారం ఉదయం ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిమూర్ గ్రామంలో ఉన్న ఆశారాం బాపు సేవా కేంద్రంలో ఒక కారు నుంచి దుర్వాసన వస్తుండాన్ని సిబ్బంది గమనించారు. పరిశీలించగా ఆ కారులో బాలిక మృతదేహం ఉన్నది. దీంతో ఆశ్రమ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఆశారాం బాపు ఆశ్రమానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల కిందట ఇంటి నుంచి మాయమైన బాలికను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆశ్రమం సిబ్బందిలో ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ బృందాన్ని ఆ ఆశ్రమానికి పంపారు. బాలిక మృతదేహం లభించిన కారు, చాలా రోజులుగా ఆ ఆశ్రమంలో పార్క్ చేసి ఉందని పోలీసులు తెలిపారు.
మరోవైపు 2013లో రాజస్థాన్లోని జోధ్పూర్ ఆశ్రమంలో 16 ఏండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో ఆశారాం బాపును మధ్యప్రదేశ్లోని ఇండోర్ పోలీసులు 2014లో అరెస్ట్ చేశారు. విచారణ జరిపిన జోధ్పూర్ ప్రత్యేక కోర్టు 2018లో ఆయనను దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.