భువనేశ్వర్ : ఆర్ధికంగా వెనకబడిన వర్గాలకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రుణాల పేరుతో రూ 109 కోట్లు కొల్లగొట్టిన మైక్రోఫైనాన్స్ కంపెనీ ఎండీని ఒడిషాలోని సుందర్ఘఢ్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. సంస్ధ ఎండీ దీపక్ కిండోపై ఏడాది కిందట లుక్అవుట్ నోటీస్ జారీ చేసిన క్రమంలో గురువారం ఆయన స్వగ్రామం తలసర బ్లాక్లోని లుల్కిడిహిలో ఒడిషా పోలీస్ ఆర్ధిక నేరాల విభాగం పోలీసులు కిండోను అరెస్ట్ చేశారు.
ఆర్బీఐ వద్ద ఎన్బీఎఫ్సీ-ఎంఎఫ్ఐగా నమోదైన సంబంధ్ ఫిన్సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కిండో బ్యాంకులు ఇతర ఆర్ధిక సంస్ధల నుంచి నిధులను రాబట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు తక్కువ వడ్డీరేటుతో రుణాలను అందచేస్తుంటాడు. అయితే 2015 నుంచి 2020 వరకూ కిండో కంపెనీ ఫోర్జరీ పత్రాలతో పలు ఇన్వెస్టర్లు, రుణ సంస్ధల నుంచి రూ 109 కోట్లకు పైగా నిధులు రాబట్టింది.
వీటిని అర్హులైన పేదలకు రుణాల కింద పంపిణీ చేయాల్సి ఉండగా తన వ్యక్తిగత ఖాతాలతో పాటు బంధువుల ఖాతాలకు, సంబంధ్ సబ్సిడరీల ఖాతాలకు మళ్లించాడు. ఈ కేసులో ఇప్పటికే కిండో భార్య అమృతను అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.