సారపాక, జనవరి 24 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో ఐటీసీ పీఎస్ పీడీలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్టర్ ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
దీనికి సంబంధించి బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కండక్టర్స్ కాలనీకి చెందిన ఐటీసీ పీఎస్పీడీ కాంట్రాక్టర్ మల్లిపెద్ది శరత్ కుమార్ పిల్లలకు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో ఖమ్మంలోని తన అత్తగారింటికి వెళ్లారు.
ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి ఎదురుగా ఉన్న రాంబాబు అనే వ్యక్తి శరత్ కుమార్ కు ఫోన్ చేసి మీ ఇంటికి తూర్పుభాగంలో ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. మీరు వచ్చారా అని అడిగాడని, మేం రాలేదని చెప్పి వెంటనే తన వద్ద పనిచేస్తున్న ముదిగొండ రవికి ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూడాలని చెప్పాడన్నారు.
రవి, రాంబాబులు కలిసి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తీసి ఉందని, చీరలు చిందరవందరగా పడి ఉన్నాయని, కబోర్డులు తెరిచి ఉన్నాయని, బంగారం కవర్ హాలులో పడేసి ఉందని ఇంటి యజమాని శరత్ కుమార్ కు వారు చెప్పారు.
24న ఉదయం ఇంటికి చేరుకుని చూడగా బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గమనించి పోలీసుస్టేషన్కు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అదనపు ఎస్సై కాజా నసీరుద్దీన్, క్లూస్ఓం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీం సిబ్బంది వేలిముద్రలు, తదితర వాటిని సేకరించారు.
ఈ చోరీలో బాధితునికి సంబంధించిన మూడు బంగారు నెక్లెస్లు, నల్లపూసల గొలుసు, మూడు బంగారు గొలుసులు, ఐదు బంగారు ఉంగరాలు, పెద్ద సెట్టు బంగారు చెవిదిద్దులు, బుట్టలు, చెవికన్నులు, రెండు వెండి కుంకుమ గిన్నెలు, గంధం గిన్నె, మూడు జతల పట్టీలు, 2 వడ్డాణాలు(రోల్డ్ గోల్డ్ వి) మొత్తం 41.500 తులాల బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని బాధితుడు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితుడు శరత్ కుమార్ ఫిర్యాదు మేరకు ఎస్సై జితేందర్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.