జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం జాలోర్ జిల్లాలో దారుణం జరిగింది. తన లైంగిక కోరిక తీర్చలేదని ఓ యువకుడు వివాహిత మహిళను హత్యచేశాడు. ఆపై పారిపోకుండా ఆమె మృతదేహాన్ని కౌగిలించుకుని పడుకున్నాడు. అహోర్ పోలీస్స్టేషన్ పరిధిలోని థన్వారా ఏరియాలో ఇవాళ ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. థన్వారా ఏరియాకు చెందిన వివాహిత మహిళ శాంతిదేవి (32) స్థానికంగా తన ఇద్దరు కొడుకులతో కలిసి ఉంటున్నది. ఆమె భర్త మహారాష్ట్రలో పనిచేస్తూ అప్పుడప్పుడు వచ్చి భార్యకు డబ్బులు ఇచ్చి వెళ్తుంటాడు.
ఈ క్రమంలో స్థానికంగా ఉండే గణేశరమ్ (22) అనే యువకుడి కన్ను శాంతిదేవిపై పడింది. గత కొన్ని రోజులుగా ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. తన కోరిక తీర్చాలని వెంటపడుతున్నాడు. అయితే, ఆమె అతని ప్రతిపాదనను తిరస్కరిస్తూ వచ్చింది. దాంతో గణేశరమ్ ఆమెపై పగ పెంచుకున్నాడు. ఇవాళ ఉదయం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనికి వెళ్లిన శాంతిదేవిని అందరి ముందే కత్తితో నరికిచంపాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని కౌగిలించుకుని పడుకున్నాడు.
దాంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడి నుంచి శాంతిదేవి మృతదేహాన్ని విడిపించి పో్స్టు మార్టానికి తరలించారు. నిందితుడు గణేశరమ్ను అరెస్ట్ చేశారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం శాంతిదేవి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.