రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ దంతెవాడలో ఓ మహిళా సర్పంచ్ భర్తను మావోలు హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గ్రామంలో పడేసి పరారయ్యారు. అయితే, హత్యకు సంబంధించి కారణాలు తెలియరాలేదు. మలంగర్ ఏరియా కమిటీ ఈ ఘాతుకానికి పాల్పడిందని సమాచారం. హత్యలో మావోల పాత్రపై ఇంకా స్పష్టత లేదని పోలీసులు పేర్కొంటున్నారు. సమాచారం ప్రకారం.. అరన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో మలంగర్ ఏరియా కమిటీకి చెందిన ఐదారుగురు సాయుధ నక్సల్స్ శుక్రవారం అర్ధరాత్రి రేవాలి గ్రామానికి చేరుకున్నారు. సర్పంచ్ భర్త భీముడు బార్సే నుంచి ఇంట్లో నుంచి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు.
మరుసటి రోజు ఉదయం గ్రామంలో బార్సే మృతదేహం కనిపించింది. అనంతరం గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. భద్రతా బలగాలు సైతం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనపై దంతెవాడ ఎస్పీ సిద్ధార్థ్ తివారీ స్పందించారు. హత్యపై సమాచారం అందిందని, మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? లేక మరెవరి హస్తం ఉందా? అనేది ఇంకా స్పష్టంగా తెలియదన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే పూర్తి స్థాయిలో విషయాలు తెలుస్తాయన్నారు.