బెంగళూరు : ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఒకరిపై ఒకరు మనసు పారేసుకున్నారు. మనసులు కలవడంతో ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు.. కానీ కులం అడ్డొచ్చింది. తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకోనని దూషిస్తూ.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది.
కర్ణాటకలోని విజయపురా జిల్లాలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ధనేశ్వరి(23) ఇంజినీరింగ్ విద్యను అభ్యసించింది. ఇదే కాలేజీలో చదువుకుంటున్న శివకుమార్ చంద్రశేఖర్ అనే యువకుడు ధనేశ్వరికి పరిచయం అయ్యాడు. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ ఒకే కోర్సు చదవడంతో.. జాబ్ కోసం కూడా కలిసి ప్రయత్నించారు. బెంగళూరులోనే ఇద్దరికి ఉద్యోగం లభించింది. అలా వీరి ప్రేమ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. అయితే తనను పెళ్లి చేసుకోవాలని శివకుమార్ను ధనేశ్వరి అడిగింది. పెళ్లి ప్రతిపాదనను తన తల్లిదండ్రులకు చెప్పి, అంగీకారం తీసుకుంటానని శివకుమార్ ఆమెకు చెప్పాడు.
ఇంటికి వెళ్లిన శివకుమార్ తన పెళ్లి ప్రతిపాదన గురించి తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు తిరస్కరించారు. తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని తెగేసి చెప్పారు. దీంతో శివకుమార్ తిరిగి బెంగళూరుకు చేరుకున్నారు. తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకోనని ధనేశ్వరికి అతను తేల్చిచెప్పాడు. చేసేదేమీ లేక ఒకరోజు బాధితురాలు.. శివకుమార్ ఆఫీసుకు వెళ్లి, తనను పెళ్లి చేసుకోవాలని వేడుకుంది.
ఈ పరిణామాల మధ్య ఒక రోజు ధనేశ్వరిని శివకుమార్ నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించాడు. అక్కడ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 80 శాతం కాలిన గాయాలతో ఆమె చికిత్స పొందుతూ మార్చి 15వ తేదీన కన్నుమూసింది. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ధనేశ్వరి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు.