భోపాల్ : బాలికను వేధింపులకు గురి చేసిన ఓ యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా చితకబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రెవా జిల్లాలో వారం రోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. 28 ఏండ్ల వయసున్న బల్దౌ జాదవ్.. దోపిడీ కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. తాను నివాసముంటున్న ఏరియాలో ఓ బాలికపై కన్నేసి.. ఆమెను వేధింపులకు గురి చేశాడు.
బాలిక ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో జాదవ్ను బాలిక కుటుంబ సభ్యులు పట్టుకుని చితకబాదారు. మెడకు బెల్ట్ను చుట్టి హింసించారు. నోట్లో నుంచి రక్తం కారేలా కొట్టారు. తాను తప్పు చేశానని, మరోసారి ఇలాంటి పాడు పనులు చేయనని ప్రాధేయపడినప్పటికీ అతన్ని వదిలిపెట్టలేదు. ఈ ఘటనను కొందరు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. యువకుడిని చితకబాదిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.