న్యూఢిల్లీ : ఫైవ్స్టార్ హోటల్లో రెండేండ్ల పాటు మకాం వేశాడు. ఐదు నక్షత్రాల ఆతిథ్యం స్వీకరించి ఆపై బిల్లు చెల్లించకుండా చెక్కేశాడు. 603 రోజులు అప్పనంగా అతిధి మర్యాదలు పొందిన ఆ వ్యక్తి స్టార్ హోటల్ను రూ. 58 లక్షలకు ముంచేసి చుక్కలు చూపాడు. ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయానికి సమీపంలోని రోజేట్ హౌస్ అనే హోటల్లో ఈ ఘటన జరగ్గా ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో హోటల్ అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం రోజేట్ హౌస్ మోటల్లో అంకుష్ దత్తా అనే అతిధి 603 రోజుల పాటు గడిపడంతో రూ. 58 లక్షల బిల్లు అయింది.
బిల్లు మొత్తంలో ఒక్క పైసా కూడా చెల్లించకుండా దత్తా హోటల్ రూం ఖాళీ చేశారు. హోటల్ నిబంధనలకు విరుద్ధంగా దత్తాను హోటల్లో ఉండేలా ఫ్రంట్ ఆఫీస్ విభాగం హెడ్ ప్రేమ్ ప్రకాష్ సహకరించాడని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దత్తాతో లాలూచీ పడి కొంత డబ్బును రాబట్టి ఎక్కువ కాలం నిందితుడు హోటల్లో ఉండేందుకు ప్రకాష్ సహకరించాడని హోటల్ యాజమాన్యం అనుమానిస్తోంది.
2019 మే 30న హోటల్లో చెకిన్ అయిన దత్తా ఒక రాత్రికే రూంను బుక్ చేసుకున్నాడని, ఆయన మరుసటి రోజు మే 31నే చెకవుట్ కావాల్సి ఉండగా హోటల్ సిబ్బందితో కుమ్మక్కై 2021 జనవరి 22 వరకూ స్టే చేశాడని యాజమాన్యం చెబుతోంది. హోటల్ నిబంధనల ప్రకారం ఎవరైనా గెస్ట్ తన బకాయిలను 72 గంటలకు మించి చెల్లించకుండా ఉంటే ఆ విషయాన్ని సీఈవో, ఫైనాన్షియల్ కంట్రోలర్ దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉండగా, ప్రకాష్ మాత్రం దత్తా బకాయిల వ్యవహారాన్ని సీఈవో, ఎఫ్సీకి సమాచారం అందించలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Train | 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న రైలు నుంచి జారిపడ్డ యువకుడు