లక్నో : కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో ఆగ్రహానికి లోనైన మామ తన కోడలి గొంతుకోసి హత్య చేసిన దారుణ ఉదంతం యూపీలోని మీరట్ జిల్లాలో వెలుగుచూసింది. అక్టోబర్ 4న నిందితుడు రాం కిషనన్ కుమారుడు, ఇంటీరియర్ డిజైనర్గా పనిచేసే అమిత్ బన్సల్ తన కార్యాలయంలో ఉరి వేసుకుని మరణించాడు. అదేరోజు బన్సల్ భార్య పింకీ అతడికి పలుమార్లు ఫోన్ చేయగా అతడి నుంచి సమాధానం రాలేదు.
అనుమానంతో ఆమె బన్సల్ కార్యాలయానికి వెళ్లగా అక్కడ అతడు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. దీంతో భయానికి లోనైన పింకీ సైతం ఆత్మహత్యకు యత్నించింది. అదేసమయంలో అక్కడికి చేరుకున్న బన్సల్ తండ్రి కొడుకు మరణించడం చూసి ఉద్వేగానికి లోనై టేబుల్పై ఉన్న కట్టర్తో కోడలు పింకీ గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన పింకీ ఆపై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. నిందితుడు రాం కిషన్ను మీరట్ పోలీసులు అరెస్ట్ చేశారు.