Crime news : మహారాష్ట్రలోని పుణె సిటీ సమీపంలో గల ఓ హోటల్లో ఆదివారం ఉదయం దారుణ హత్య జరిగింది. పుణె-సోలాపూర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఒక రెస్టారెంట్లో అవినాష్ దాన్వే అనే వ్యక్తిని కొందరు దుండగులు పిస్టల్తో కాల్చి, వేట కత్తులతో నరికి దారుణంగా చంపేశారు. ధాన్వే స్నేహితుల ముందే ఈ హత్య జరిగింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
వివరాల్లోకి వెళ్తే.. పుణెకు చెందిన అవినాష్ ధాన్వే అనే వ్యక్తి ఆదివారం ఉదయం తన స్నేహితులతో కలిసి నగర సమీపంలోని ఓ హోటల్కు వెళ్లాడు. అక్కడ కూర్చుని వారితో మాట్లాడుతుండగానే ఇద్దరు వ్యక్తులు తుపాకులతో లోపలికి వచ్చి అతి సమీపం నుంచి అతని తలపై కాల్చారు. దాంతో కుర్చీలో కూర్చుని ఉన్న ధాన్వే అలాగే టేబుల్పై పడిపోయాడు. ఈ హఠాత్పరిణామంతో ధాన్వే స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు.
అంతటితో ఆగక మరో నలుగురైదుగురు దుండగులు వేట కత్తులతో వచ్చి అప్పటికే స్పృహ తప్పి పడి ఉన్న ధాన్వేను విచక్షణారహితంగా నరికారు. ఈ హత్య జరుగుతున్న సమయంలో హోటల్ ఉన్న వాళ్లంతా భయంతో పరుగులు తీశారు. హత్య దృశ్యాలు హోటల్ సీసీ టీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.