చెన్నై : మధురైకి చెందిన మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేసిన కసిమేడు నివాసి లోకేష్ (21)ను తమిళనాడు పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. నిందితుడిపై గతంలో రెండు హత్యలు, హత్యాయత్నం కేసులు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడి లైంగిక దాడికి గురైన బాలిక (17) ప్రస్తుతం ఐదునెలల గర్భిణిగా గుర్తించారు. మూడేండ్ల కిందట లోకేష్ శబరిమల యాత్రకు వెళుతూ మధురైలో ఆగిన క్రమంలో బాలికతో పరిచయం స్నేహంగా మారింది.
ఆపై ఇద్దరూ తరచూ ఫోన్లో చాటింగ్ చేసుకునేవారు. ఐదు నెలల కిందట మధురై నుంచి బాలికను తన ఇంటికి తీసుకువచ్చిన నిందితుడు ఆమెతో కలిసి నివసిస్తున్నాడు. స్ధానికుల ఫిర్యాదుతో పోలీసులు, బాలల సంక్షేమ కమిటీ సభ్యులు విచారించగా నిందితుడి తల్లి సహకారంతో లోకేష్, బాధిత బాలిక సహజీవనం చేస్తున్నట్టు వెల్లడైంది. బాలికను కాపాడిన బాలల సంక్షేమ కమిటీ అధికారులు అనాధాశ్రమంలో ఆమెకు ఆశ్రయం కల్పించారు. లోకేష్తో పాటు అతని తల్లి గీతను పోలీసులు అరెస్ట్ చేశారు.