బెంగళూరు: చాక్లెట్ బార్లో పురుగులు కనిపించడంతో ఒక వ్యక్తి రూ.50 లక్షలు పరిహారం కోరాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లే అవుట్లో నివాసం ఉంటున్న ముఖేష్ కుమార్ కెడియా, 2016 అక్టోబర్లో స్థానిక ఎంకే రిటైల్ సూపర్ మార్కెట్లో క్యాడ్బరీ ఫ్రూట్, నట్ చాక్లెట్లను ఒక్కొక్కటి రూ.89 చొప్పున రెండు కొనుగోలు చేశాడు. తన మేనకోడలకు వాటిని ఇచ్చాడు. అయితే ఒక చాక్లెట్ బార్లో పురుగులు ఉన్నట్లు ముఖేష్ కుమార్కు తెలిసింది. దీంతో క్యాడ్బరీ కస్టమర్ హెల్ప్లైన్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ సిబ్బంది పురుగులున్న చాక్లెట్ను తిరిగి ఇవ్వాలని అడిగారు. అయితే దానికి నిరాకరించిన అతడు దాని ఫొటోను వారికి పంపాడు.
కాగా, తన ఫిర్యాదుపై క్యాడ్బరీ సంస్థ స్పందించకపోవడంతో 2016 అక్టోబర్ 26న బెంగళూరులోని అర్బన్ జిల్లా వినియోగదారుల కోర్టును ముఖేష్ కుమార్ ఆశ్రయించాడు. క్యాడ్బరీ చాక్లెట్ల తయారీ సంస్థ మాండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నాణ్యతా విభాగం అధిపతితోపాటు కొనుగోలు చేసిన ఎంకే రిటైల్ బ్రాంచ్పై ‘సేవా లోపం’ కింద ఫిర్యాదు చేశాడు. రూ.89 విలువైన చాక్లెట్లో పురుగులు ఉండటంపై రూ.20 నుంచి రూ.50 లక్షల వరకు పరిహారం కోరాడు.
మరోవైపు ఆ చాక్లెట్లో పురుగులున్న విషయాన్ని వినియోగదారుల కోర్టు అంగీకరించింది. అయితే ముఖేష్ కుమార్ డిమాండ్ చేస్తున్న అంత భారీ పరిహారం తమ పరిధిలోకి రాదని తేల్చి చెప్పింది. దీని కోసం రాష్ట్ర వినియోగదారుల కోర్టుకు వెళ్లాలని సూచించింది. ఆరేళ్ల విచారణ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 8న ఈ మేరకు తీర్పు ఇచ్చింది.