ముంబై : ప్రభుత్వాలు, పోలీసులు పలు చర్యలు చేపడుతున్నా సైబర్ నేరాలకు అడ్డుకట్టపడటం లేదు. తాజాగా ఓ కేటుగాడు బీఎస్ఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్గా చెప్పుకుంటూ మహిళను రూ 10.85 లక్షలకు మోసం చేశాడు. ఆమె మొబైల్ సిమ్ను యాక్టివేట్ చేసే పేరుతో బాధితురాలి క్రెడిట్, డెబిట్ కార్టుల వివరాలు తీసుకుని ఘరానా మోసానికి పాల్పడ్డాడు. పుణేలోని వనవాడి ప్రాంతానికి చెందిన 57 ఏండ్ల మహిళ గురువారం స్ధానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటపడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె వాట్సాప్కు బీఎస్ఎన్ఎల్ లోగోతో మెసేజ్ వచ్చింది. మెసేజ్ పంపిన వ్యక్తి తాను కొతురడ్ కార్యాలయానికి చెందిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగినని చెప్పుకున్నాడు. ఆమె మొబైల్ సిమ్ గడువు తీరిందని, 24 గంటల్లో కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుందని నమ్మబలికాడు. సిమ్ యాక్టివేషన్ కోసం వాట్సాప్ మెసేజ్లో ఇచ్చిన నెంబర్కు కాల్ చేయాలని కోరాడు. సిమ్ యాక్టివేట్ చేసే పేరుతో ఆమె డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను తెలుసుకుని ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ 10.85 లక్షలు కాజేశాడు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.