కోల్కతా : యువతి (21)ని ఆటోలో వేధింపులకు గురిచేసి ఆపై వెంబడించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆటోలో వేధించడంతో పాటు తర్వాత నడిరోడ్డుపై వెకిలిచేష్టలకు పాల్పడ్డాడు. నిందితుడి చర్యతో అప్రమత్తమైన బాధితురాలు సాయం కోసం అరవగా స్ధానికులు, పోలీసులు అప్రమత్తమై నిందితుడిని పట్టుకున్నారు. కోల్కతాలోని బెహలా ట్రామ్ డిపో వద్ద ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
నిందితుడిని సుధీర్ మాఝీగా గుర్తించారు. మాఝీ ఆటోలో యువతితో కలిసి ప్రయాణిస్తుండగా ఆమె దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించగా పట్టించుకోకపోవడంతో వేధింపులకు గురిచేశాడు. ఆటో దిగిన తర్వాత నడిరోడ్డుపై ఆమె పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.