అహ్మదాబాద్: మద్యం, డ్రగ్స్కు బానిసైన కుమారుడ్ని తండ్రి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికాడు. పాలిథిన్ బ్యాగుల్లో ఉంచి పలు ప్రాంతాల్లో పడేశాడు. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ సంఘటన జరిగింది. అంబావాడి ప్రాంతంలో నివాసం ఉంటున్న 65 ఏళ్ల నీలేష్ జోషి రిటైర్డ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. అతడి కుమారుడు 21 ఏళ్ల స్వయం జోషి మద్యం, డ్రగ్స్కు బానిస అయ్యాడు. డబ్బుల కోసం తండ్రితో తరచుగా గొడవపడేవాడు.
కాగా, ఈ నెల 18న తండ్రి నీలేష్ను కుమారుడు స్వయం జోషి డబ్బులు డిమాండ్ చేశాడు. నీలేష్ నిరాకరించడంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన తండ్రి వంట గదిలోని గ్రైండర్ రోలు రాయితో కుమారుడి తలపై పలుసార్లు కొట్టాడు. తల పగిలి రక్తం కారి కుమారుడు స్వయం జోషి మరణించాడు.
అనంతరం తండ్రి నీలేష్, కాలూపూర్ మార్కెట్కు వెళ్లాడు. ఎలక్ట్రానిక్ కట్టర్ మెషిన్, పాలిథిన్ బ్యాగులు కొన్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ కట్టర్తో కుమారుడి మృతదేహాన్ని ఆరు ముక్కలుగా కట్ చేశాడు. వాటిని పాలిథిన్ బ్యాగుల్లో ఉంచి స్కూటర్పై తీసుకెళ్లాడు. వస్నా, ఎల్లిస్ వంతెన ప్రాంతాల్లో పాడేశాడు.
ఆ తర్వాత ఇంటికి తాళం వేసిన నీలేష్, నేపాల్కు పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీనికి ముందు ఉత్తరప్రదేశ్ గొరఖ్పూర్లోని గొరఖ్నాథ్ ఆలయాన్ని సందర్శించాలని భావించాడు. అహ్మదాబాద్ నుంచి బస్సులో సూరత్ చేరుకున్నాడు. ఉత్తర ప్రదేశ్లోని గొరఖ్పూర్ వెళ్లేందుకు అవధ్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కాడు.
మరోవైపు ఈ నెల 20న వస్నాలో, తర్వాత రెండు, మూడు రోజుల్లో ఎల్లిస్ వంతెన ప్రాంతాల్లో మానవ శరీర భాగాలను స్థానికులు గుర్తించారు. వీటి గురించి ప్రజల్లో కలకలం రేగింది. దీంతో అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడు నీలేష్ జోషిని గుర్తించారు. అతడు అవధ్ ఎక్స్ప్రెస్ రైలులో ఉత్తర ప్రదేశ్కు వెళ్తున్నట్లు పసిగట్టారు. రైల్వే పోలీసుల సహకారంతో రాజస్థాన్లోని గంగాపూర్ రైల్వే స్టేషన్లో ఆగిన అవధ్ ఎక్స్ప్రెస్ రైలులో ఉన్న నీలేష్ను అరెస్ట్ చేశారు.
కాగా, మద్యం, డ్రగ్స్కు బానిసైన కుమారుడ్ని తానే హత్య చేసినట్లు తండ్రి నీలేష్ ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జర్మనీలో స్థిరపడిన కుమార్తె వద్ద నీలేష్ భార్య గత ఆరేళ్లుగా ఉంటున్నదని, దీంతో అహ్మదాబాద్లోని కుమారుడి వద్ద నిందితుడు ఉంటున్నాడని పోలీసులు తెలిపారు.