చెన్నై : జ్యుడిషియల్ రిమాండ్కు తరలిస్తున్న 45 ఏండ్ల నిందితుడు అంబత్తూర్లోని మేజిస్ట్రేట్ నివాసంలో హంగామా సృష్టించాడు. మేజిస్ట్రేట్ను చంపుతానంటూ బెదిరించడమే కాకుండా పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. నిందితుడిని అల్వర్తిరుంనగర్కు చెందిన ముజీబుర్ రెహ్మీన్గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రెహ్మాన్కు ఓ మహిళా న్యాయవాదితో ఆర్ధిక లావాదేవీల విషయంలో వివాదం నెలకొంది.
దీంతో ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెహ్మాన్ తాజాగా శనివారం మరోసారి మహిళా న్యాయవాదిపై అభ్యంతర వ్యాఖ్యలు చేయడంతో నజరత్పేట్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా పోలీసులు ప్రశ్నించిన అనంతరం నిందితుడిని అంబత్తూర్లోని మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచడంతో అక్కడ నానా హంగామా సృష్టించాడు.
కేసు విచారణ చేపట్టిన మేజిస్ట్రేట్ను పరుష పదజాలంతో దూషించాడు. ఆపై తన చుట్టూ ఉన్న పోలీస్ సిబ్బందిని తోసివేసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఎస్ఐ రవిచంద్రన్తో పాటు కానిస్టేబుల్ అతడిని వెంటాడి పట్టుకున్నారు. నిందితుడిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు తిరిగి అదే మేజిస్ట్రేట్ ఎదుట అతడిని హాజరుపరచగా న్యాయమూర్తి జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించారు.