చెన్నై: మరణించిన బంధువు అంత్యక్రియలకు వెళ్లిన ఒక వ్యక్తి చనిపోయినట్లు పోస్టర్లో కనిపించాడు. దీంతో తన భర్తను అతడి కుటుంబ సభ్యులు హత్య చేశారని ఆరోపిస్తూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమిళనాడుకు చెందిన అమూల్, గౌతమ్కు రైలులో ఏర్పడిన పరిచయం వారిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. కాగా, ఇరువురి కులాలు వేరు కావడంతో ఆమెతో పెండ్లికి గౌతమ్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అయినప్పటికీ వారిద్దరు రెండేండ్ల కిందట పెండ్లి చేసుకుని చెన్నైలో ఉన్నారు. గౌతమ్ వారాంతరాల్లో తన గ్రామానికి వెళ్లి కుటుంబాన్ని కలిసివచ్చేవాడు.
అమూల్ గర్భవతి కావడంతో ఆమె కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉండేందుకు ఇటీవల అవూరులో వారు నివసిస్తున్నారు. ఈ నెల 17న పాపకు అమూల్ జన్మనిచ్చింది. మరోవైపు అదే రోజున బంధువు ఒకరు మరణించినట్లు గౌతమ్కు ఫోన్ వచ్చింది. దీంతో తన సొంతూరుకు వెళ్లిన గౌతమ్ అనంతరం తిరిగి రాలేదు. అతడి మొబైల్ ఫోన్ ఆఫ్లో ఉన్నది. ఈ నేపథ్యంలో అమూల్ కుటుంబ సభ్యులు గౌతమ్ గ్రామానికి వెళ్లారు. అయితే ఈ నెల 17న అతడు చనిపోయినట్లుగా నివాళి అర్పిస్తూ గ్రామంలో పోస్టర్ ఉండటం చూసి వారు షాకయ్యారు.
ఈ విషయం తెలిసి ఆందోళన చెందిన అమూల్ తన పసిపాపతో తిరువళ్లు పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తన భర్త చనిపోయిన విషయం తనకు చెప్పలేదని, కుటుంబ సభ్యులే అతడ్ని హత్య చేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.