చెన్నై : ఓ లాయర్ తన ప్రియురాలిని అత్యంత దారుణంగా హత్య చేసి బాత్రూమ్లో పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని మధురైలో చోటు చేసుకుంది.
మధురైకి చెందిన హరికృష్ణన్(40) కొన్నేళ్ల క్రితం నుంచి భార్యకు దూరంగా ఉంటున్నాడు. పదేండ్ల కూతురు మాత్రమే హరికృష్ణన్ వద్ద ఉంటుంది. ఈ క్రమంలో హరికృష్ణన్కు యోగా టీచర్ చిత్రదేవీ (36) పరిచయమైంది. ఆమె కూడా భర్తకు దూరంగా ఉంటుంది. దీంతో హరికృష్ణన్, యోగా టీచర్ మధ్య ఏర్పడిన పరిచయం.. ప్రేమకు దారి తీసింది.
అయితే ఏప్రిల్ 2న చిత్రదేవీ అదృశ్యమైనట్లు ఆమె తండ్రి కన్నయ్య పోలీసులకు 5వ తేదీన ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక తండ్రి కన్నయ్య.. చిత్రదేవీ, హరికృష్ణన్ మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణను సంపాదించి పోలీసులకు సమర్పించాడు. ఈ క్రమంలో హరికృష్ణన్ మంగళవారం తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా, సూసైడ్ నోట్ లభ్యమైంది. చిత్రదేవీని తానే హత్య చేశానని, తన ఇంట్లోని బాత్రూమ్లో పూడ్చిపెట్టానని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు లాయర్. ఆమెను చంపానన్న బాధ భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపాడు. మొత్తానికి ఈ ఘటనపై పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు.