ముంబై : తనకు తాను దేవుడి అవతారంగా చెప్పుకుంటూ దుష్ట శక్తులను సంహరిస్తానని నమ్మబలికి మహిళను రూ 32 లక్షలకు మోసం చేసిన దొంగబాబా ఉదంతం మహారాష్ట్రలోని థానే జిల్లాలో వెలుగుచూసింది. డొంబివ్లిలోని రాంనగర్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
నిందితుడిని జలగావ్ జిల్లాకు చెందిన బబన్ బాబూరావ్ పాటిల్గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధిత మహిళ కుటుంబం నుంచి దుష్టశక్తులను తరిమేస్తానని నమ్మబలికిన నిందితుడు తొలుత డిసెంబర్ 2019లో డబ్బు డిమాండ్ చేశాడు.
ఆపై నిందితుడు పలుమార్లు రూ 31.60 లక్షల నగదు, ఇతర విలువైన వస్తువులను తీసుకుని తమ సమస్యను మాత్రం పరిష్కరించలేదని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. మహిళను మోసగించిన పాటిల్పై చీటింగ్ సహా పలు అభియోగాలపై కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు స్ధానిక కోర్టులో హాజరుపరచగా అతడిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి తరలించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు.