బర్మేర్: ఐదు నెలల క్రితం వరకు ఆనందంగా గడిపిన ఆ ఆరుగురు సభ్యుల కుటుంబంలో ఇప్పుడు ఒక్కరే మిగిలారు. తల్లి, తండ్రి, నలుగురు బిడ్డలతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. ఐదు నెలల క్రితం తల్లి కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు తండ్రి తన నలుగురు బిడ్డలను నీళ్ల ట్యాంకులో పడేసి, తాను అదే ట్యాంకులో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. రాజస్థాన్ రాష్ట్రం బర్మేర్ జిల్లాలోని పోషాల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పోషాల గ్రామానికి చెందిన పుఖారామ్ (30) భార్య, నలుగురు బిడ్డలతో కలిసి నివసించేవాడు. అయితే, ఐదు నెలల క్రితం కరోనా మహమ్మారి బారినపడి భార్య మరణించింది. దాంతో నలుగురు ఆడపిల్లల బాగోగులు చూడటం పుఖారామ్కు కష్టంగా మారింది. ఈ క్రమంలోనే తన మరదలు పెండ్లి చేసుకుంటానని అడిగాడు, అందుకు అత్తింటి వాళ్లు ఒప్పుకోలేదు. పోనీ పిల్లలను చూసుకోవాలని కోరినా వాళ్లు పట్టించుకోలేదు.
దాంతో తీవ్ర మనస్థాపం చెందిన పుఖారామ్ తన బిడ్డలు నలుగురు జియో (9), నోజీ (7), హైనా (3), లాసీ (18 నెలలు)లను తమ ఇంటి ముందున్న 13 అడుగుల లోతు నీళ్ల ట్యాంకులో పడేసి, తాను అదే ట్యాంకులో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే, పుఖారామ్ దూకుతుండగా గమనించిన ఇరుగుపొరుగు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేలోగా నీళ్ల ట్యాంకు నుంచి పుఖారమ్ను వెలికితీశారు.
అయితే, అతను అపస్మారక స్థితిలో ఉండటంతో పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పుఖారామ్ నలుగురు బిడ్డలను వెలికితీయగా వాళ్లు అప్పటికే మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అప్పటిదాకా తమ కండ్లముందే ఆడిన చిన్నారులు నలుగురు ఒకేసారి విగతజీవులుగా మారడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.