న్యూఢిల్లీ : నోయిడా సెక్టార్ 39లోని ఓ మాల్లో సిబ్బందితో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి (30) ప్రాణాలు కోల్పోయాడు. బిహార్లోని చప్రా జిల్లా హసన్పురాకు చెందిన బ్రిజేష్ రాయ్ మాల్లోని బార్కు స్నేహితులతో కలిసి సోమవారం పార్టీ చేసుకునేందుకు వెళ్లాడు.
రాత్రి 11 గంటల సమయంలో బార్లోని బౌన్సర్లలో ఒకరితో వారికి వివాదం నెలకొంది. ఈ ఘర్షణలో రాయ్ తీవ్రంగా గాయపడటంతో సమీప ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘర్షణలో పాలుపంచుకున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.