ముంబై: మౌత్ వాష్ కోసం అమెజాన్లో ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి రెడ్మీ నోట్ 10 మొబైల్ ఫోన్ డెలివరీ అయింది. ఆశ్చర్యపోయిన ఆయన జరిగిన పొరపాటును అమెజాన్ దృష్టికి తీసుకెళ్లారు. ముంబైకి చెందిన లోకేశ్ అనే వ్యక్తి రూ.459 విలువైన నాలుగు కోల్గెట్ మౌత్ వాష్ల కోసం ఇటీవల అమెజాన్లో ఆర్డర్ చేశారు. అయితే ఆయనకు వాటి బదులు రూ.13,000 విలువైన రెడ్మీ నోట్ 10 మొబైల్ ఫోన్ డెలివరీ అయ్యింది. ప్యాకెట్ తెరిచి చూసిన ఆయన లోపల మొబైల్ ఫోన్ ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ప్యాకెట్పై తన అడ్రస్ ఉండగా లోపల బిల్లు మాత్రం తెలంగాణకు చెందిన మరో వ్యక్తి పేరుతో ఉన్నది.
దీంతో లోకేశ్ దానిని తిరిగి ఇచ్చేందుకు అమెజాన్ యాప్లో ప్రయత్నించారు. అయితే మౌత్ వాష్ వినియోగించే వస్తువు కావడంలో సాధ్యపడలేదు. ఈనేపథ్యంలో లోకేశ్ జరిగిన పొరపాటును మెయిల్ ద్వారా అమెజాన్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేగాక ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో అది వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు లోకేష్ నిజాయితీని మెచ్చుకున్నారు. ఆ మొబైల్ ఫోన్ను అమెజాన్ ఆయనకు బహుమతిగా ఇవ్వాలంటూ కొందరు ఫన్నీగా కామెంట్ చేశారు.