పట్నా : ప్రియురాలిని కలిసేందుకు వచ్చిన వ్యక్తికి ఆమెతో గ్రామస్తులు వివాహం జరిపించిన ఘటన బిహార్లోని నవాడ జిల్లా ఖంకనాపూర్లో వెలుగుచూసింది. ప్రియురాలిని రహస్యంగా కలిసేందుకు వచ్చిన వ్యక్తిని గ్రామస్తులు పట్టుకుని ఆపై ఇద్దరికీ వివాహం జరిపించారు. ఖంకనాపూర్ గ్రామానికి చెందిన మహిళను కలిసేందుకు పొరుగున ఉన్న ముంగెర్ నుంచి ఆమె ప్రియుడు వచ్చాడు.
రాజు ఖాన్, షబనా పర్వీన్ కొద్దికాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. ఆమెను పెండ్లి చేసుకుంటానని చెబుతూ రాజుఖాన్ తరచూ కలుస్తున్నాడు. ఇటీవల రాజు షబనాను ఆమె ఇంటిలో కలుసుకున్నాడు. వీరిద్దరిని గ్రామస్తులు పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఇద్దరి అభిప్రాయాలను తెలుసుకుని వారికి పెండ్లి జరిపించారు. తమ పెండ్లి వీడియోను బహిర్గతం చేయవద్దని రాజు గ్రామస్తులను కోరాడు. అయితే వీరి పెండ్లికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మహిళ కుటుంబ సభ్యులు, సామాజిక కార్యకర్తలు, బంధువుల సమక్షంలో రాజు, షబనా ఒక్కటయ్యారు.