లక్నో : పేదరికంతో అల్లాడుతూ కన్నకొడుకును రూ 3 లక్షలకు అమ్మకానికి పెట్టిన వ్యక్తి కొడుకును ఎవరూ కొనలేదనే కోపంతో చిన్నారిని పొట్టనపెట్టుకున్న వ్యక్తి ఉదంతం యూపీలోని అమ్రోహ జిల్లాలో వెలుగుచూసింది. నిందితుడిని దినసరి కూలీగా పనిచేసే మహ్మద్ నౌషద్గా గుర్తించారు. తన మనవడి మరణంపై నిందితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో బుధవారం నౌషద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్రోహ జిల్లా ధనోరా ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
మద్యం, జూదానికి బానిసైన నౌషద్ డబ్బు కోసం కొడుకును అమ్ముతానంటూ బేరం పెట్టాడని నిందితుడి భార్య పోలీసులకు వెల్లడించింది. బాలుడిని అమ్మే ప్రయత్నాలు మానుకోవాలని భర్తకు నచ్చచెప్పానని, ఈ విషయమై ఇద్దరికీ నిత్యం ఘర్షణ జరిగేదని ఆమె పేర్కొంది.
నౌషద్ మంగళవారం తన భార్యను పొరుగున ఉండే ధనోరా మండి ప్రాంతంలో ఫోన్ చార్జర్ తీసుకురమ్మని పంపగా అనుమానంతో తిరిగి వచ్చేసరికే బాలుడి గొంతుపిసికి ఉసురుతీశాడని ఆమె విలపించింది. తాను ఇంటికి వచ్చే సమయానికి బాలుడు అపస్మారక స్ధితిలోకి వెళ్లాడని పోలీసులకు వివరించింది. నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించామని పోలీసులు తెలిపారు.