ముంబై : కొవిషీల్డ్ వ్యాక్సిన్ను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన నవీ ముంబైలో వెలుగుచూసింది. నిందితుడు కిషోర్ ఖెట్ కుమార్ను నీరుల్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రెండు వయల్స్, 15 కొవిషీల్డ్ సిరంజిలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడికి కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఎలా అందుబాటులోకి వచ్చిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ను ఓ వ్యక్తి రూ 4000కు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నాడనే సమాచారంతో అప్రమత్తమై నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. నిందితుడు ఎంతమందికి కొవిషీల్డ్ వ్యాక్సిన్ను బ్లాక్ మార్కెట్లో విక్రయించాడనే వివరాలను ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.